Home » » ఉద్యోగ పర్వము: ద్వితీయాశ్వాసము

ఉద్యోగ పర్వము: ద్వితీయాశ్వాసము

 


ఆ విధంగా సంజయుడు ధర్మజుని వద్ద శలవు తీసుకుని ఉపప్లావ్యం వదిలి హస్తినా పురం చేరాడు. దృతరాష్ట్రుని అంతఃపురానికి వెళ్ళి దర్శించాడు. దృతరాష్ట్రుడు సంజయుని చెంతన కూర్చుండజేసి జరిగిన విషయం వివరించమని అడిగాడు. 

సంజయుడు మహారాజా! ధర్మరాజు మీ క్షేమం మీ కుమారుల క్షేమం అడిగాడు అన్నాడు. దృతరాష్ట్రుడు సంజయా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమేనా? అతని బంధు మిత్రులు అతని పట్ల ప్రీతితో మెలగు తున్నారు కదా అన్నాడు. 

సంజయుడు మహారాజా! ధర్మరాజు అతని సోదరులు క్షేమమే. ధర్మరాజుకు దైవ చింతన మెండు కదా. అతడు ధర్మాన్ని నమ్ముకున్నాడు కనుక భారం నీమీద పెట్టాడు. నీవు నీ కొడుకులను నమ్మావు. అతడేమో కర్ణుని, శకుని నమ్మి వారి ఆధీనంలో ఉంటాడు. 

కడుపుకు అన్నం తినేవాడు నీ కొడుకులు చేసే దుర్మార్గాలు చూస్తూ ఊరకుంటారా? లోకంలో ఎవరికి కొడుకులు లేరా కొడుకులు దుర్మార్గం చేస్తుంటే బుద్ధి చెప్పక నీ మాదిరి చూస్తూ ఊరక ఉండేవారు ఎవరయినా ఉంటారా? ప్రజలంతా నిన్ను తిడుతుంటే విన లేక చెవులు తూట్లు పడుతున్నాయి. నువ్వూ , నీకుమారులు శకుని ఆడించినట్లు ఆడుతున్నారు. 

పాండవులు మంచి వాఋ కనుక సరి పోయింది. లేకున్న మీరంతా ఈ సరికి నాశనం అయి ఉండే వారు. సుయోధనుడు ధర్మరాజు శాంతగుణాన్ని పిరికితనం అనుకుంటున్నారు. అది పొరబాటు. ధర్మరాజు తన తమ్ములను అదుపులో పెడుతున్నారు కనుక మీరు జీవించి ఉన్నారు. 

లేకున్న ఈ సరికి మీరు ప్రాణాలతో ఉండే వారు కాదు. జూదం ఆడిన రోజే అవినీతికి బీజం పడింది. అది కార్చిచ్చులా ఇప్పుడు రగులుతుంది. ధర్మరాజు మెత్తని పులి, అవసరం వచ్చినప్పుడు అతడి తిరగబడితే అతనిని ఆపగలవారు లేరు అన్నాడు.

దృతరాష్ట్ర విదురుల ఆలోచన:

దృతరాష్ట్రుడు వెంటనే విదురుని మందిరానికి పిలిపించి విదురా! సంజయుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. మనసు వికలమయింది నిద్ర రావడం లేదు అన్నాడు. విదురుడు దృతరాష్ట్రా! బలవంతుని చేతిలో దెబ్బలు తిన్న బలహీడు, ఇతరుల డబ్బు అపహరించ కాచుకున్న వాడు, ధనం సంపద పోగొట్టుకున్న వాడు, కామంతొ కైపెక్కిన వాడు నిద్రపట్టక అవస్థ పడతాడు. వీటిలో నీకు ఏ దోషం ఉంది. 

ఇతరుల సొమ్ము అపహరించి నీవు ఒక్కడివే అపహరించాలని అనుకున్నావు అందుకే నీకు నిద్ర రావడం లేదు అన్నాడు. దృతరాష్ట్రుడు అది కాదు విదురా! ధర్మరాజు మనో గతం అవగతం కాక నిద్ర రావడం లేదు అన్నాడు. విదురుడు రాజా! నీ బంధువు, హితుడు, సేవకుడు, శాంతమూర్తి అయిన ధర్మరాజు నీకు కీడు తలపెడతాడా? అతని రాజ్యాన్ని అతనికి ఒప్పగించి ఇప్పటికైనా నీవు నీ కుమారులు చేసిన తప్పు సరిదిద్దు. 

ధర్మరాజు నిన్ను పెదనాన వైనా తండ్రిలా చూస్తున్నాడు కనుక సహిస్తున్నాడు. నీవు రాజ్య భారాన్ని దుర్యోధన, శకుని, కర్ణ, దుశ్శాసనుల మీద మోపడం మంచికి కాదు అది నీకూ తెలుసు అన్నాడు. దృతరాష్ట్రుడు విదురా! రేపు సభలో సంజయుడు చెప్పినది విని మాకు ఏది క్షేమమో అది చేయించు. ఇప్పుడు నా మనసుకు శాంతి కలిగేలా నీ అమృత వచనం నా మీద కురిపించు అన్నాడు.

విదురనీతి:

దృతరాష్ట్రుడు అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది. విదురుడు రాజా! మనిషి తనను లోకులు నిందించే పని చేయక లోక హితమైన కార్యాలు చేయాలి. పరుల సంప్దకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి. 

కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం. తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు. అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు. 

ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది. ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది. తాను ఒక్కడే తినడమూ అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు.

 లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు. క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు. పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు. బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు. 

న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడమూ వలన కీడు కలుగుతుంది. పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు.

 కనుక వారు వాటి జోలికి పోరు. తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానిమిచ్చి పిదప చింతించక ఉండుట, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది. స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. 

తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. 

నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు అన్నాడు. 

దృతరాష్ట్రునికి విదురుడు బుద్ధిమతి చెప్పుట:

విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు అని అడిగాడు. విదురుడు అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. 

చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని. పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు. 

ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి. గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు. మనసుకు తగిలిన గాయం మాన్పవచ్చు కాని శరీరానికి తగిలిన గాయం మాన్పలేము. 

ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపు మాటలు నీకు తెలియనివా? చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు. 

ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు.ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు. 

పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందు వలన అందరూ సుఖపడతారు. 

పెద్దలు లేని సభ సభ కాదు, న్యాయం మాటాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మధ్యమము, భారంగా బ్రతుకు లాగుట అధమం. నీతి దూరులను ఉత్తములు మెచ్చరు. నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు.

 దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోస్త హిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. పాడవులు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది. మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. 

నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది. ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమాను అన్నాడు. 

దృతరాష్ట్రుడు విదురా! నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను అన్నాడు. విదురుడు రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . 

జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు. అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు.పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. 

కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. 

శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? అన్నాడు. దృతరాష్ట్రుడు విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది అన్నాడు. విదురుడు రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను.

 నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు.ఉద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా! ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు. కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు అన్నాడు. దృతరాష్ట్రుడు విదురా! నీ మాటలు బాగున్నాయి. అలాగే చేస్తాను అన్నాడు.విద్రుడు ఆ మాట మీద ఉండు దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా ధర్మరాజుతో సంధి చేసుకో అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు.

సభలో సంజయుని సంధి ప్రస్థావన:

మరునాడు దృతరాష్ట్రుడు సభ తీర్చాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వథామ, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శల్యుడు, దుర్యోధనాదులు సభ ప్రాంగణంలో ఉన్నారు. సంజయుడు సభను ఉద్దేశించి దృతరాష్ట్రునితో రాజా! మీరు ఆదేశించినట్లు ఉపప్లావ్యం వెళ్ళి ధర్మరాజును చూసాను ధర్మరాజు పేరు పేరున మిమ్మలిని యోగక్షేమాలు అడిగాడు. 

నేను వివరించాను అలాగే కృష్ణార్జు నులను కలిసాను. శ్రీకృష్ణుడు నాతో ఇలా అన్నాడు సంజయా! అజాత శత్రువైన ధర్మరాజుకు కోపం వస్తే నీటిలో నిప్పు పుట్టిన చందాన ఉంటుంది దానిని ఆర్పడం ఎవరి తరం కాదు. యుద్ద్ధం అనివార్యం అయితే మీరు మీ సమస్త సంపదలు యోగ్యులకు పంచి బంధు మిత్రులతో భోగములను అనుభవించి యుద్ధ భూమికి రండి. 

నాడు సభలో ద్రౌపది గోవిందా రక్షించు అని నన్ను వేడుకున్నది ఇంకా చెవిలో వినిపిస్తుంది. తీర్చలేని ఆ అప్పు తీర్చకనే నేను సారధ్యం వహిస్తున్నను. అర్జునుని గాండీవానికి కౌరవ సేన దగ్ధం కాక తప్పదు అన్నాడు. అప్పుడు అర్జునుడు సంజయా! ధరాజు అడిగినట్లు రాజ్య భాగం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు భీముడు నేను దుర్యోధనుని అకృత్యాలకు బదులు చెప్పక వదలము.

 దుర్యోధనుని యుద్ధ భూమిలో అంపశయ్య మీద పరుండ చేయకుంటే ధర్మరాజు భూశయనం చేసిన దానికి అర్ధము లేదు. భీముడు యుద్ధ భూమిలో గధ తీసుకుని వీర విహారం చేస్తుంటే దుర్యోధనుడు రాజ్యం ఇవ్వక ఏమి చేస్తాడు. కౌరవులు మాటలతో సంధి చేయరు. కేవలం యుద్ధము తోనే మాట వింటారు. నకుల సహదేవులు, అభిమన్యుడు, సాత్యకి యుద్ధ భూమిలో వీర విహారం చేస్తున్నప్పుడు సుయోధనుడు సంధి చేస్తాడులే. 

సుయోధనుడు మరణించిన తరువాత భీష్ముని మీదకు శిఖండి ఉరికి నప్పుడైనా కౌరవులకు సంధి చేయక తప్పదు. దుస్టద్యుమ్నుడు ద్రోణుని మీదికి యుద్ధానికి దిగినప్పుడైనా సంధి చేయక తప్పుతుందా? సుయోధనుడు మహాత్ముడైన శ్రీకృష్ణుని లక్ష్య పెట్టడు, మేము భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించి యుద్ధానికి దిగుతాము. 

మా రాజ్యభాగాన్ని అధర్మంగా అపహరించి నియమభంగం చేసి తిరిగి మా రాజ్యాన్ని మాకు ఇవ్వని కౌరవులను సంహరించి మా రాజ్యాన్ని తీసుకుంటే ధర్మం గెలిచినట్లే కాని ఇందు అధర్మం ఏమీ లేదు. ఇలా నిండు సభలో దృతరాష్ట్రునికి చెప్పు .భీస్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వథామ, శల్యులు నిర్ణయించినది జరుగుతుంది. యుద్ధాన్ని నివారిస్తే సుయోధనుడు ఆయుష్మంతు డౌతాడు అని చెప్పారు అన్నాడు. 

భీష్ముడు:

ఈ మాట్లు విన్న భీష్ముడు శ్రీకృష్ణుడు అర్జునుడు నర నారాయణులు ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని నిర్మూలించ డానికి ప్రతి యుగంలోను అవతరిస్తారు. ఇప్పటికే కాలకేయులను, నివాతకవచులను సంహరించారు. వారిరువురు రెండుగా కనిపించే ఒకే శక్తి .వారిరువురిని గెలవడం హరునికైనా సాధ్యం కాదు. 

శ్రీకృష్ణుని సారధ్యంలో అర్జునుడు గండీవం ఎక్కు పెట్టినప్పుడు నీకు తెలుస్తుందిలే. అయినా సుయోధనా నీవు గర్విష్టివి నా మాటలు లెక్క చేయవు దుర్మార్గులైన కర్ణ, శకుని, దుశ్శాసనుల మాటలు నీకు వీనుల విందులు. 

దీని ఫలితంగా యుద్ధ భూమిలో మా అందరి మరణ వార్తలు వింటావు అనగానే కర్ణుడు లేచి మీరు ఇలా మాటాడ తగునా నేనుేమి చేసాను ? సుయోధనుని కొలువులో ఉంటూ అతను పెట్టిన అన్నం తింటున్నను కనుక అతనికి హితముగా మాట్లాడుతాను. 

నేను దృతరాష్ట్ర సతీ, పుత్ర, పొఉత్రులకు హితము చేస్తాను లేకున్న సుయోధనుడు నన్ను ఇంత వాడిని చేస్తాడా? అన్నాడు. భీష్ముడు దృతరాష్ట్రా! ఈ కర్ణుడు పాండవులకు ఇసుమంత అయినా పోలడు. పాండవులను గెలుస్తానని ప్రగల్భాలు చేసే వీడిని నమ్మి సుయోధనుడు పాండవులతో శత్రుత్వం వహించి యుద్ధానికి దిగుతున్నాడు. 

పాండవులు ఎన్నో విజయాలు సాధించారు. వీడు ఇప్పటికి ఒక్క విజయం పొందాడా? ఉత్తర గోగ్రహణంలో వీడి తమ్ముని చంపి గోవులను అర్జునుడు తరలించుకు పోతుంటే అక్కడే ఉమ్డి వీడు ఏమి చేసాడు? ఘోష యాత్రలో నీకుమారుని ఓడింప చేసిన వీడు ప్రగల్భాలు పలుకు తుంటే నీవు వింటున్నావు అన్నాడు. 

ద్రోణుడు లేచి మహారాజా! భీష్ముడు మీకందరికి ఆప్తుడు ఇరువురికి కావలసిన వాడు. కనుక మీ హితవు కోరి సంధి చేయమంటున్నాడు. ఖాండవ వన దహనం మొదలు అర్జునిని విజయాలు ఆలోచించండి. ఎంతో మంది ధస్సు పట్టిన వీరులు ఉన్నా విజయుడు అన్న పేరు ఒక్క అర్జునినికి మాత్రమే దక్కింది . అర్జునుడు అన్నంత పని చేస్తాడు అన్నాడు.

 భీష్మ ద్రోణుల మాటలు విననట్లే ఉన్న దృతరాష్ట్రుడు వారికి సమాధానం చెప్పక సంజయా ! ధర్మరాజుకు మన సైన్యం గురించి తెలుసా? మనసైన్యం గురించి అతడు ఏమని అనుకుంటున్నాడు? అతని వైపు ఎవరు ఉన్నారు? అని అడిగాడు. 

ఆ మాటలు విన్న సంజయుడు దృతరాష్ట్రుడు ఇంత వెర్రి వాడా ! పాండవుల బలాబలాలు అడుగు తున్నారు. ఇతనికి ఏమి చెప్పి ఏమి ప్రయోజం అనుకుని దేవా! మరలా చెప్తున్నాను మీరు సగ భాగం ఇస్తే యుద్ధ మాట తలపెట్టడు. అతడు సంధికి సిద్ధం అంటున్నాడు. యుద్ధం వస్తే అతడు ఎవరిని లక్ష్య పెట్టడు. 

నీకు తెలియనిది ఏమున్నది .బకుడిని, హిడింబుని, కీచకుని , కిమ్మీరుని వధించిన భీముడు వారి పక్షమే కదా! ఫాలాక్షుని ఓడించిన అర్జునుడు వారి పక్షమే ద్రుపది కుమారులు, అభిమన్యుని కుమారులు వారికి కాక ఎవరికి చేస్తారు. శ్రీకృష్ణుడు , సాత్యకి వారికి బాసటగా ఉన్నారు. ద్రుపదుడు, కేకయరాజులు, సరాసంధుని కుమారు డైన సహదేవుడు, జయత్సేనుడు, శిశుపాలుని కుమారురులు వృషభుడు, దృష్టకేతు, మాయావిద్య విశారధుడు భీముని కుమారుడు ఘటోత్కచుడు వారి పక్షాన తలపడటానికి సిద్ధం. 

ఇంకా తూర్పు ఉత్తర దేశరాజులు ధర్మరాజుకు సాయంగా ఉన్నారు. శ్రీకృష్ణుని సాయం కన్నా మించినది లేదు కదా! ధర్మరాజుకు మనతో పోరు సల్పడానికి ఇంకేమి కావాలి? అన్నాడు సంజయుడు.

దృతరాష్ట్రుడు:

ఇది విని దృతరాష్ట్రుడు సంజయా! నీవు చెప్పినది నిజము. వారంతా ఒక ఎత్తు భీముడు ఒక ఎత్తు. అతడిని తల్చుకుంటే భయంగా ఉన్నది. మనలో అతడిని ఎదుర్కోడానికి ఎవరున్నారు. చిన్నప్పటి నుండి అతడు నామాట వినడు. భీముని చేతిలో కష్టాలు పడుతూ కూడా సుయోధనుడు కయ్యానికి కాలు దువ్వు తున్నాడు.. వాడికి ఏ ఆయుధమూ పని లేదు. 

జరాసంధుని ఒక్క ఒక్క పోటుతో చంపాడు. వాడికి ఏ ఆయుధమూ పని లేదు చేతితోనే ఎందరినైనా చంపగలడు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు వాడికి అర్జునుడు సాయం ఉన్నాడు. ఇక ఏమి చెప్పను. అర్జునితో సమానంగా యుద్ధం చేసే వాడిని మనం చూసామా? అతనికి సారధి శ్రీకృష్ణుడు ఉన్నాడు. ముగ్గురూ కలిస్తే కౌరవ సేనను దహిస్తారు.

వారి గురించి భీష్మ, ద్రోణులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. అయినా వారు మన కొరకు యుద్ధం చేస్తారు. వారికి కురు పాండవులు సమానమే కదా? నా మాట నా కుమారులు వినరు. మొదటి నుండి విదురుడు చెప్పినది జరుగుతుంది సంజయా ! నేనేమి చేయను, నా కేది దారి నా కేది శరణ్యము . ధర్మరాజు వినయ వంతుడు. 

అతనికి వుదురుడు , దృపదుడు, సోదరులు, శ్రీకృష్ణాదులు తోడు ఉండగా ధర్మరాజుతో పోరుకు తలపడటం మిడతలు పోయి మంటలో పడటం లాంటిది. వంశ నాశనం తప్పదు శాంతి మార్గమే మేలు నా కుమారులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. 

సంజయుడు దేవా! మీరు చెప్పినది సబబు అప్పుడు ధర్మరాజుని వదిలావు కాని అతడు నిన్ను వదలక ఘోష యాత్రలో నీ కుమారులను రక్షించాడు. అతడు మిమ్ము ఎన్నటికీ అతిక్రమించడు. అతడిని పిలిపించి సంధి కావించండి అన్నాడు.

సుయోధనుడు:

దుర్యోధనుడు తండ్రీ! మీ మాటలు విచిత్రముగా ఉన్నవి ఎక్కడో అడవులలో ఇడుములు పడుతున్న వారిని తెచ్చి కొంత మంది పిరికి వాళ్ళను జత చేసినంత మాత్రాన పాండవులు గెలుస్తారా? నీకు ఇంత భీతి వలదు మన బలాన్ని తక్కువగా ఛూడకు.

 మేము గెలుస్తాము. పరశురాముని గెలిచిన భీష్ముడు మన పక్షాన ఉన్నాడు. ద్రోణుడు, కృపాచారులు సామాన్యులా? ఈశ్వర వర ప్రసాదితుడి అశ్వథామ సామాన్యుడా? సహజ కవచ కుండల ధారి కర్ణుని ఎదిరించ గలవాడు పాండవులలో ఎవరు? బాహ్లికుడు, సింధురాజు, సోమదత్తుడు, గాంధారరాజు సామాన్యులా? వీరిని గెలుచుట పాండవులకు శక్యమా ? మీరు సందేహించ కండి మేము వారి అడుగులకు మడుగులు వత్తము. యుద్ధము చేస్తాము పారి పోము; ఇదే మా నిశ్చిత అభిప్రాయము. 

మా చేత బాధలు పడ్డవాళ్ళు దండెత్తి వస్తే పారిపోవడం చిన్నతనం కాదా? వారిని చూసి భయపడి మాకు తలవంపులు తేకండి. భీముడే కాదు నాతో తలపడి గధా యుద్ద్ధం చేయగల వాడు ముల్లోకాలలో లేడు. భీముని నేను చంపగలను అతడు మరణిస్తే పాండవ పక్షాన యుద్ధం చేయగల వారు లేరు. అందుకే ధర్మరాజు ఐదు ఊళ్ళు ఇమ్మని అడిగాడు.

 కర్ణుని వద్ద ఉన్న శక్తి అర్జునిని చంపుతుంది. భీష్మాదుల శరాగ్ని వారి సేనను నాశనం చేస్తుంది. ఇక నీమిగిలిన కుమారులు అత్యంత శక్తి మంతులు కారా? మన సైన్యం పదకండు అక్షౌహినులు వారి సైన్యం ఏడు అక్షౌహినులు ఇది తెలియక ఎందుకు దు॰ఖిస్తున్నావు? అని సంజయుని చూసి సంజయా! ఇంతకూ అల్లరి మూకను తయారు చేసుకున్న ధర్మరాజు ఏమంటున్నాడో చెప్పు అన్నాడు. సంజయుడు చెప్పసాగాడు సుయోధనా! పాండవులు యుద్ధంఅంటే భపడలేదు ఏదో పెండ్లికి పోతున్నట్లు భావిస్తున్నారు.

అర్జునిని పాశుపతం, భీమ్కుని గధాయుధం నమ్మి యుద్ధానికి దిగుతున్నారు అని చెప్పి దృతరాష్ట్రుని చూసి దేవా! వారి మాటలను బట్టి భీష్ముడు శిఖండి వంతు, ద్రోణుడు దుష్టద్యుమ్నుని వంతు, దుర్యోధనుడు అతని తమ్ములు భీముని వంతు మీలోని యువకులు అభిమన్యుని వంతు, అశ్వత్థామ, కర్ణుడు, సైంధవుడు మొదలగు మహా వీరులు అర్జునిని వంతు కృతవర్మ సాత్యకి వంతు సోమదత్తుడు చేకితానుడు అనే యాదవ రాజు వంతు శకుని నకుల సహదేవుల వంతు, శల్యుని ధర్మరాజు సంహరిస్తాడు . 

ఇక మీరి ఆలోచించీ నిర్ణయించండి అన్నాడు. అదివిన్న దృతరాష్ట్రుడు అయ్యో ఇక నాకు దిక్కెవరు? ధర్మరాజు శ్రీకృష్ణుడు ఉన్న సైన్యాన్ని నా కొడుకు లెక్క చేయక పోవడం నా కర్మ. ఇక చెప్పకు అలా జరగాలంటే అలా జరుగుతుంది అన్నాడు. 

అలా దుఖిస్తున్న తండ్రిని చూసి సుయోధనుడు తండ్రీ మేము పాండవులు ఒకే చోట పుట్టి పెరిగాము కదా మా కంటే పాండవులు బలవంతులు ఎలా అయ్యారు? నువ్వు ఎప్పుడూ వారిని పొగుడు తుంటావు ఈ రాజ్యం మాది మాకు దక్కాలని భగవంతుడు నిర్ణయించారు. బాధపడ వద్దు అన్నాడు. దృతరాష్ట్రుడు సంజయా! చూసావా నా కొడుకు పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నారు. పాండవుల వైపు వారిని ఎవరు రెచ్చ కొడుతున్నారు? అన్నాడు. 

సంజయుడు దేవా! దుష్టధ్యుమ్నుడు పాండవులలో అగ్నిని రెచ్చ కొడుతుంటాడు. తాను ఒక్కడే కౌరవ సైన్యాన్ని హతమారుస్తాను అంటాడు. ధర్మరాజు నువ్వు అన్నంత పని చేస్తావు అంటాడు అప్పుడు దుష్టధ్యున్ముడు నన్ను చూసి మహేశ్వరుడు, ఇంద్రుని అనుగ్రహం పొందిన మా అర్జునునితో సరి పోలు వారు కౌరవ సేనలో ఎవరున్నారు? ధర్మరాజును శరణు వేడి బ్రతకమని సుయోధనునికి చెప్పు అన్నాడు. 

అది విన్న దృతరాష్ట్రుడు కుమారా నీకు సగం రాజ్యం చాలదా? ధర్మరాజుకు సగరాజ్యం ఇచ్చి హాయిగా బ్రతకవచ్చు కదా పెద్దల మాటలు నీకు ఎందుకు వినవు? శకుని, కర్ణుల మాటలు ఎందుకు వింటావు అన్నాడు.ఆమాటలకు కోపించిన దుర్యోధనుడు నామాటలు ద్రోణుడు , భీష్మాదులు అంగీకరించడం లేదు. 

నేను ధర్మరాజుకు సూది మొన ఓపినంత భూమి కూడా ఇవ్వను కర్ణుడు, దుశ్శాసాదుల సహాయంతో యుద్ధం చేసి పాండవులను గెలుచుట నిశ్ఛయం. ఇదే నా నిర్ణయం అన్నాడు.దృతరాష్ట్రుడు కుమారా ! నా మాట విని యుద్ధం మాను. భీముడు యుద్ధ రంగంలో నిన్ను నీ సైన్యాన్ని చీల్చి చెండాడు తున్నప్పుడైనా నా మాట వింటావా? అర్జునుడు ఛంఢ ప్రఛంఢుడై సైన్యాన్ని దునుమాడుతున్నప్పుడైనా నామాట వింటావా? నీది కేవలం మానవ శక్తి పాండవులది దైవ శక్తి అర్జునుడు అగ్ని దేవుని వలన అక్షయ తుణీరాన్నీ పొందాడు.

 వాయు దేవుడు, ఇంద్రుడు, యముడు, అశ్వినీ దేవతలు వారిని కాపాడు తుంటారు. కనుక వారిని చంపడం భీష్మునికి వీలు కాదు. దేవతలకు వీలు కాని రాక్షసులను అర్జునుడు చంపాడు, కనుక అతడు దేవతలను మించిన వాడు. కనుక శాంతి ఒక్కటే ప్రస్తుత కర్తవ్యం అన్నాడు. సుయోధనుడు తండ్రీ ! రాగద్వేషాలకు అతీతు లైన దేవతలు వారికి ఎలా సాయం వస్తారు. 

వారు పక్షపాత బుద్ధి వహిస్తే వారికి దైవత్వం ఎలా సిద్ధిస్తుంది? పాండవులకు దేవతల సాయం ఉంటే అరణ్యాలలో ఎందుకు కష్ట పడతారు? ఆత్మస్తుతి క్షమార్హం కాదు కాని నాకు కోపం వస్తే పాండవులను దేవతలు కూడా రక్షించ లేరు. 

ధర్మ తనయుడు, అతని సోదరులు, పాంచాలురు, విరాటుడు, అతని తమ్ములు, కుమారులు వాసుదేవాది యాదవులు, కేకయ, పాండ్య, మగధ, చైద్య, ప్రముఖ వీరులు నా బారిన పడి అణగారి పోవడం మీరు వింటారు. వారి తేజస్సు , శౌ ర్యము నాకు సాటి రావు, పితామహ, ద్రోణ , అశ్వథామ , కృపులకు తెలిసిన సమస్త అశ్త్రాలు నాకు తెలుసు అన్నాడు. 

కర్ణుడు భీష్ముడు:

తరువాత కర్ణుడు లేచి మిత్రమా! నాకు గురువుగారి కోపం కారణంగా అస్త్రషస్త్రాలు గుర్తుకు రావు అని లోకులు అంటారు. కాని ఆ మహాను భావుడు నాకు వాటి స్పురణ ప్రసాదించాడు. కావున నాకు అస్త్ర సంపద ఉన్నది నిశ్చయము.

 దేవతలకు కూడా నన్ను గెలవడం కష్టం అర్జునుడు ఎంత నేను పాండవులను గెలుచుట తధ్యం అన్నాడు. భీష్ముడు లేచి కర్ణా! యముని ప్రేరణతో మాట్లాడుతున్న నిన్ను వారించడం మా తరమా? పాండవులు యుద్ధంలో రాలి పోతారా? అనవసరంగా నోరు నొప్పి పుట్టేలా వాగకు. దేవేంద్రుడు ఇచ్చిన శక్తితో అర్జునుని చంపగలనని అనుకుంటున్నావు. శ్రీకృష్ణుని చేతిలో అది ముక్కలు కాక తప్పదు. 

అర్జునిని కొరకు నీ వద్ద ఉన్న సమస్త అస్త్రాలను శ్రీకృష్ణుడు నాశ్హనం చేస్తాడు. దృతరాష్ట్రా! దాయాదులు కలిసి ఉంటే క్షేమంగా ఉంటారు లేకున్న సస్తం కోల్పోతారు. కనుక సంధి చేసుకో అన్నాడు. భీష్ముడు సుయోధనా సంధి చేసుకుని ధర్మరాజుతో చేరు భీష్ముడు మన హితం కోరుతాడు. అతడి మాటను మన్నించు అన్నాడు. 

సుయోధనుడు ఆ మాటలను లక్ష్యపెట్ట లేదు. ఆ మాటలకు కోపించిన సుయోధనా! మాట్లాడ వెందుకు అర్జునుడు గోగ్రహణంలో ఒకసారి ఒంటరిగానే విజృంభించి నపుడు నీ సైన్యం పారి పోలేదా? కర్ణుడు నీ చెంత ఉండి ఏమి చేసాడు. కాని ఇప్పుడు అలా కాదు. శ్రీకృష్ణుని సారధ్యంలో అర్జునుడు విజృంభిస్తే ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. 

కర్ణా యుద్ధంలో మరణించి వీరుడవు అనిపించు కుంటావు. సుయోధనుని మరణానికి కారకుడవు అవుతావు అన్నాడు.కర్ణుడు విరక్తిగా సుయోధనా! భీష్ముని మాటలు నా మనసుని కలచి వేస్తున్నాయి. ఈ భీష్ముడు చచ్చే వరకు నేను యుద్ధభూమిలో అడుగు పెట్టను. ఆతరువాత నేను నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు అని అస్త్ర సన్యాసం చేసిన కర్ణుడు ఇక అక్కడ ఉండలేక సభ వదిలి వెళ్ళాడు. 

అప్పుడు భీష్ముడు నవ్వుతూ అయ్యో సుయోధనా! ఇంతటి మహా వీరుడు అలిగితే ఎలాగా! కుమారా నీవు ఈ కర్ణును అండ చూసుకుని యుద్ధానికి దిగాతావు. అప్పుడు మా ప్రతాపములో వ్యత్యాసం చూడు. సుయోధనా! నేను, బాహ్లికుడు, ద్రోణుడు కలసి శత్రు నాశనం చేస్తాము అన్నాడు. సుయోధనుడు కర్ణుడు పోయాడన్న బాధ భరించ లేక తెలిసో తెలియకో అందరూ పాండవులు గెలుస్తారని అంటున్నారు. 

మొదట నిన్ను, ద్రోణుని, బాహ్లికుని నమ్మాను. కాని ఇప్పుడు చెప్తున్నాను. కర్ణుడు, దుశ్శాసనుడు నా వెంట ఉంటే విజయం నాదే నాకు వేరొకరితో పనిలేదు అన్నాడు. సుయోధనుని మాటలకు కలత చెందిన దృతరాష్ట్రుడు విదురా! నా కుమారుడు కర్ణునితో కలసి మృత్యు పాశంలో ఇరుక్కున్నాడు. ఈ సమయంలో ఏమి చేయాలి చెప్పు అన్నాడు. 

విదురుడు మహారాజా! మన వాళ్ళు దుర్బలులై ఒకరిలో ఒకరు కలహించుకోవడం మనకు మరింత ప్రతికూలం అర్జునునకు అనుకూలం. మాటలు కట్టిపెట్టి పాండవులను పిలిచి సంధి చేయించు అన్నాడు. దృతరాష్ట్రుడు సంజయుని చూసి సంజయా ! మరలి వచ్చు నపుడు అర్జునుడు నీతో ఏమన్నాడో చెప్పు అని అడిగాడు. సంజయుడు దేవా! అర్జునుడు నాతో ధర్మరాజు న్యాయంగా మాకు రావలసిన రాజ్య భాగం అడుగు తున్నాడు. దర్పంతో ఇవ్వకుంటే మాచేత వారు యుద్ధభూమిలో చావక మానరు అన్నాడు.

దృతరాష్ట్రుడు సంజయుని జయాపజయాలు వివరించమని కోరుట:

ఆ పై దృతరాష్ట్రుడు సభ ముగించాడు. అందరూ వెళ్ళిన తరువాత అక్కడ ఉన్న సంజయుని చూసి దృతరాష్ట్రుడు సంజయా ! నీకు ఇరు పక్షాలలో ఉన్న వీరు లందరూ తెలుసు. యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారో చెప్పగలవా అని అడిగాడు. సంజయుడు దేవా ! ఈ విషయం నన్ను అడగడం కన్నా గాంధారిని, మీ తండ్రి వ్యాసుని పిలిపించి అడగడం మంచిది అన్నాడు. 

వెంటనే దృతరాష్ట్రుడు తన తండ్రి వ్యాసుని ధ్యానించాడు. గాంధారిని పిలిపించాడు. వ్యాసుడు స్సంజయుని ఛూసి సంజయా! నీకు అన్నీ తెలుసు. నేను వినేలా దృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానం చెప్పు అన్నాడు. సంజయుడు దృతరాష్ట్రా ! నీవు కౌరవ పండవ సేనకు కల తారతమ్యం గురించి అడిగావు. పాండవ పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడు. 

మీ పక్షాన ఎవరున్నారు చెప్పు. పాండవుల బలం శ్రీకృష్ణుడే . సమస్త లోకాలు ఒక పక్కన శ్రీ కృష్ణుడు ఒక పక్కన నిలిచినా శ్రీకృష్ణుడు గెలుస్తాడు. సత్యం, ధర్మం , న్యాయం ఎక్కడ ఉన్నాయో శ్రీకృష్ణుడు అక్కడ ఉంటాడు.

 శ్రీకృష్ణుని ఆశ్రయించిన వారికి జయం తప్పదు అన్నాడు. దృతరాష్ట్రుడు సంజయా! కృష్ణుని గురించి నాకు తెలియక పోవడానికి నీకు తెలియడానికి ఏమి కారణం అన్నాడు. సంజయుడు లోకంలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. 

అవిద్యతో అలమటిస్తున్న వారు తమో గుణంతో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని తెలుసుకో లేరు. విద్యా వినయ భూషితుడు తెలుసు కొనగలడు. దృతరాష్ట్రుడు విద్య అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి వివరించు అన్నాడు. సంజయుడు దేవా ! ప్రతి మనిషికి సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయి. 

నేను వాటికి లోబడక పక్షపాత రహితంగా నిర్వికారంగా ఉండి పవిత్ర భావంతో ధర్మంగా ఉంటాను. అందువలన నేను విష్ణువును తెలుసు కున్నాను. నీకు గాని వేరెవరికైనా విష్ణువును తెసుకోవడానికి ఇది తక్క వేరు మార్గం లేదు. ఇందుకు భిన్నమైన దానిని అవిద్య అంటారు అన్నాడు. 

దృతరాష్ట్రుడు పక్కనే ఉన్న సుయోధనుని చూసి నాయనా సుయోధనా ! సంజయుడు మన శ్రేయోభిలాషి. అతని మాట విని శ్రీకృష్ణుని ఆశ్రయించి నీవు నీ తమ్ములతో క్షేమంగా ఉండండి అన్నాడు. సుయోధనుడు తండ్రీ ! ఈ లోకాలు సర్వ నాశనం అయినా నేను ధైర్యం వదలను శ్రీకృష్ణుని శరణు వేడను అన్నాడు.

 దృతరాష్ట్రుడు నిర్వేదంగా గాంధారి ! విన్నావా నీ కుమారుని మాటలు. వీడు దుర్మార్గుడు, నీతి బాహ్యుడు, గర్విష్టి, అసూయాద్వేహాలు కలవాడు నా మాట వినడు. వీడు చెడి పోతాడు. వీడికిక బ్రతుకు లేదు అన్నాడు. గాంధారి సుయోధనునితో కుమారా సుయోధనా ! ఈ ఐశ్వర్యం , సంపద , రాజ్యం, నీ ఆయుషు ఎందుకు వదులు కుంటావు. 

దైవం భీముని రూపంలో నిన్ను చంపుతుంది. నీ లాంటి అవినీతిపరుడు ఎక్కడైనా ఉంటాడా ? అన్నది. వ్యాసుడు దృతరాష్ట్రునితో నీకు శ్రీకృష్ణుడంటే భక్తి అందుకే సంజయుని రాయబారిగా పంపావు. సంజయుని మాట విని శ్రీకృషుని ఆశ్రయించు. రాగ ద్వేషాలు వదిలి ఏకాగ్రతతో ఆరాధించిన వారికి శ్రీకృష్ణుడు చేరువ ఔతాడు. కామక్రోధాలతో అలమటించే వారికి అతను దూరంగా ఉంటాడు.అన్నాడు. 

దృతరాష్ట్రుడు మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. దృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి వాసు దేవుడనే పేరు ఎలా వచ్చింది. సంజయుడు శ్రీకృష్ణుడు అంతటా ఉంటాడు. సకల జగము అతనిలో ఉంటాయి కనుక అతనిని వాసుదే వుడంటారు. ఇందియ నిగ్రహంతో అతనిని ధ్యానిస్తే అతని వశం ఔతాడు. నీవు కూడా అన్ని చింతలు వదిలి అతనిని ధ్యానించు అన్నాడు. 

దృతరాష్ట్రుడు వ్యాసమహర్షీ ! నేను శ్రీకృష్ణుని శరణు వేడుతాను . శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని దర్శింప లేను. నిరంతరం కృష్ణుని సన్నిధిలో ఉండే వారు ఎంతటి పుణ్యాత్ములో కదా అని విచారించాడు. అంతట వ్యాసుడు నిష్క్రమించాడు. దుర్యోధనుడు, గాంధారి, సంజయుడు తమ తమ నివాసములకు వెళ్ళారు. 

సంబంధిత సమాచారం కోసం :

ఉద్యోగ పర్వము: ప్రథమాశ్వాసము

ఉద్యోగ పర్వము: ద్వితీయాశ్వాసము

ఉద్యోగ పర్వము: తృతీయాశ్వాసము

ఉద్యోగ పర్వము: చతుర్థాశ్వాసము

Note: ఈ ఛానెల్‌లోని కంటెంట్ నా స్వంతది కాదు. ఇది ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఈ కంటెంట్ యొక్క అసలైన రచయితలకు మరియు మూలాల‌కు నా గౌరవం వహిస్తున్నాను.

0 comments:

Post a Comment

Subscribe Us

 
Created By SoraTemplates | Distributed By Gooyaabi Themes